Posted by CityPolice-Admin on 2026-03-24 13:10:16 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits:
కోల్కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా జూనియర్ వైద్యురాలిపై హత్యాచార కేసు (Kolkata Doctor Rape and Murder) మరో మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు అక్రమాలకు పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నించారని, హడావుడిగా తమ కుమార్తె దహన సంస్కారాలు పూర్తి చేయించారని తెలిపారు. తమకు లంచం కూడా ఇవ్వజూపారని ఆరోపించారు.
వైద్యురాలిపై హత్యాచార ఘటనకు బుధవారం రాత్రి కోల్కతా (Kolkata Protests) లో జరిగిన ఆందోళనల్లో బాధితురాలి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మృతురాలి తండ్రి మాట్లాడుతూ.. "ప్రజలకు వాస్తవాలు తెలియనీయకుండా కేసును అణగదొక్కేందుకు పోలీసులు మొదటినుంచీ ప్రయత్నించారు. మృతదేహాన్ని చూసేందుకు కూడా మమ్మల్ని అనుమతించలేదు. పోస్ట్మార్టం పూర్తయ్యేంతవరకు పోలీస్ స్టేషన్లోనే వెయిట్ చేయించారు. ఆ తర్వాత మృతదేహాన్ని మాకు అప్పగిస్తుండగా.. ఓ సీనియర్ పోలీసు అధికారి మా వద్దకు వచ్చి డబ్బులు ఆఫర్ చేశారు. మేం దాన్ని తిరస్కరించాం" అని వెల్లడించారు.
ఈ కేసుపై తొలుత కోల్కతా పోలీసులు (West Bengal Police) దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, దర్యాప్తు సమయంలో వారు వ్యవహరించిన తీరుపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే కేసును కోల్కతా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ప్రస్తుతం దీనిపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే నిందితుడు సంజయ్ రాయ్ సహా ఘటన చోటుచేసుకున్న ఆరో కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, మరికొందరికి పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు.