Posted by pallavi on 2024-09-13 20:04:27 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 62
శ్రీకృష్ణుడు ‘భగవద్గీత’లో ‘‘తా బేలు తన అవయవాలను అన్ని వైపుల నుంచి లోపలికి ముడుచుకున్నట్టు... ఇంద్రియాలను విషయాసక్తుల నుంచి అన్ని విధాలా ఉపసంహరించుకున్న వ్యక్తి బుద్ధి స్థిరంగా ఉన్నట్టు భావించాలి’’ అని చెబుతున్నాడు. ఇంద్రియాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఆయన ఉద్దేశ్యం. అవి మన అంతర్గత ప్రపంచానికి, బాహ్య ప్రపంచానికి మధ్య ద్వారాల్లాంటివి.
తాబేలును ఉదాహరణగా తీసుకుంటే, అది ప్రమాదాన్ని ఎదుర్కొనేపుడు తన అవయవాలను లోపలికి ముడుచుకుంటుంది. ఇంద్రియాలను ప్రేరేపించే, ప్రలోభపెట్టే విషయాలతో జతకూడుతున్నప్పుడు మన ఇంద్రియాలను ఉపసంహరించుకోవాలని శ్రీకృష్ణుడు సలహా ఇస్తున్నాడు.
ప్రతి ఇంద్రియానికి రెండు భాగాలు ఉంటాయి: ఒకటి బయటికి కనిపించే భాగం (ఉదాహరణకు, కంటి భాగం), రెండవది నియంత్రణ భాగం (మేధస్సులో). ఇంద్రియాలు, ఇంద్రియార్థాల మధ్య పరస్పర స్పందనలు రెండు స్థాయిలలో జరుగుతాయి. మొదటిది, కాంతి తాలూకు కణాలు (ఫోటాన్లు) బాహ్య ఇంద్రియ పరికరమైన కన్నును చేరినప్పుడు, కన్ను కాంతికి స్పందిస్తుంది. మిగిలిన ఇంద్రియాలు కూడా తమ ఇంద్రియ విషయాలకు వాటంతట అవే స్పందిస్తాయి. రెండవ స్థాయిలో, ఇంద్రియాలకు మరియు వాటిని నియంత్రించే మెదడులోని భాగాలకు మధ్య స్పందన జరుగుతుంది.
చూడాలనే కోరిక కంటి వికాసానికి కారణం. ఆ కోరిక ఇంద్రియాన్ని నియంత్రిచే భాగంలో ఉంటుంది. సాంకేతికంగా దీనిని ‘ప్రేరేపిత దృష్టి’ (మోటివేటెడ్ పర్సెప్షన్) అని పిలుస్తారు. మనం చూడాలనుకున్న వాటినే చూస్తాం, వినాలనుకున్న వాటినే వింటాం, కానీ సమగ్రంగా చూడలేం, సంపూర్ణంగా వినలేం. కృష్ణుడు ఇంద్రియాల గురించి ప్రస్తావించినప్పుడు, కోరికలను ఉత్పత్తి చేసే ఇంద్రియ నియంత్రక భాగం గురించి వివరిస్తున్నాడు. మనం ఇంద్రియాలను భౌతికంగా మూసేసినా, మన కోరికలను సజీవంగా ఉంచడం కోసం మనస్సు తన ఊహాశక్తిని ఉపయోగిస్తుంది. ఇంద్రియాలను నియంత్రించేవాటిని భౌతిక భాగం నుంచి వేరు చేయడం శ్రీకృష్ణుని మార్గనిర్దేశం. ఇదే మనకు ఉత్తేజపరిచే లేదా నిరుత్సాహపరిచే బాహ్య పరిస్థితుల నుంచి స్వేచ్ఛ (మోక్షం) పొందడానికి సహాయపడుతుంది. ఇంద్రియాలను ఎప్పుడు ఉపసంహరించుకోవాలో తెలుసుకోవడం వివేకం.