గోదావరి ఉగ్రరూపం: ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, వరద ప్రభావం పెరిగింది

ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్

Posted by pallavi on 2024-09-13 11:39:58 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 40


గోదావరి ఉగ్రరూపం: ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, వరద ప్రభావం పెరిగింది

గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం వద్ద భారీగా వరద వస్తోంది. నీటి మట్టం 13.75 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 13 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్తుంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నిన్న రాత్రి నుంచి ఈ ఉదయం వరకు పరిస్థితి మారిపోయింది. రాత్రి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ కాగా, ఈ ఉదయానికి రెండో ప్రమాద హెచ్చరిక దాటింది. గంటల వ్యవధిలోనే గోదావరి ప్రవాహం పెరిగింది. దాదాపు నెల రోజుల విరామం తరువాత గోదావరి మళ్లీ ఉప్పొంగుతోంది.


ఎగువ నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పెద్ద ఎత్తున నీరు చేరుతోంది. ఒక్క రాత్రిలోనే 3 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు చేరింది. నిన్న రాత్రి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటిమట్టం 12.10 అడుగులుండగా, 10 లక్షల 30 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. అందువల్ల మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. బ్యారేజ్ 175 గేట్లను పూర్తిగా ఎత్తి, వచ్చే నీటిని సముద్రంలోకి వదలడం జరుగుతోంది. అయితే, గోదావరి నదికి భద్రాచలం దిగువన శబరి నది కూడా పోటెత్తడంతో వరద తీవ్రత పెరిగింది. పాపికొండల విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. గోదావరి వరద నేపథ్యంలో తూర్పు గోదావరి, అల్లూరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉన్నారు.


వరద బాధితుల కోసం పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. గోదావరి మహోగ్రరూపం దాల్చడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. కాజ్ వేలపై వరద నీరు పొంగిపోతోంది. పి.గన్నవరం మండలం, మామిడికుదురు మండలాల్లో కాజేవేలు నీట మునిగాయి. నాటుపడవల పైనే ప్రయాణం సాగుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఆలమూరు మండలంలోని లంక గ్రామాలన్నీ జలదిగ్బంధంలో ఉన్నాయి. సీతానగరం మండలంలోని ములకల్లంక, రాజమండ్రి అర్బన్ మండలం బ్రిడ్జిలంక, కేతవారిలంక, వెదురు లంక ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. 17 చోట్ల ఇంజిన్ బోట్లను అధికారులు ఏర్పాటు చేశారు.

Search
Categories