Posted by pallavi on 2024-09-13 11:43:12 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 35
విజయవాడ వరద బాధితుల సహాయానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తీవ్రమైన నీటిమునుగిన ఇళ్లకు రూ. 25,000, కొంతవరకు మునిగిన ఇళ్లకు రూ. 10,000 సాయం అందించనున్నట్లు తెలుస్తోంది. ఆటోలు, ట్యాక్సీల రిపేర్లకు రూ. 10,000, బైకులకు రూ. 3,000 చొప్పున ఇచ్చే అవకాశం ఉంది. పంటల పరిహారాన్ని కూడా పెంచి ఇవ్వనున్నట్లు సమాచారం. కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సాయంపై రెండు రోజుల్లో క్లారిటీ రానున్నట్లు తెలిపారు.
కృష్ణా జిల్లాలో బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం ఈరోజు పర్యటించనుంది. ఈ నేపథ్యంలో, రామవరప్పాడు మరియు కేసరపల్లి ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ బాలాజీ పర్యటించారు. కేసరపల్లి వద్ద బుడమేరు కాలువను పరిశీలించారు. జిల్లాలో 64 గ్రామాలు బుడమేరు వరదల ప్రభావానికి గురయ్యాయని, 50 వేల హెక్టార్ల పంటలు ముంపులో ఉన్నాయని చెప్పారు. పంట నష్టం వివరాలు మరియు ప్రజల ఇబ్బందులను కేంద్ర బృందం దృష్టికి తీసుకువెళ్తామని కలెక్టర్ బాలాజీ తెలిపారు.
కలెక్టర్ ముందుగా రామవరప్పాడు ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలోని ముస్తాబాద్ రహదారి పరిశీలించారు. ఆ రహదారికి మరమ్మతులు చేపట్టేందుకు రూ. 10 లక్షల అంచనాలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. అనంతరం గన్నవరం జాతీయ రహదారి వంతెన వద్ద బుడమేరు నది ప్రవాహాన్ని పరిశీలించారు. జిల్లాలో అధిక వర్షాలు మరియు వరదల కారణంగా జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి వాస్తవంగా తెలియజేసేందుకు ఛాయచిత్రాలు మరియు వీడియోలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.